మేడిగడ్డను మళ్లీ పరిశీలిస్తాం.. తెలంగాణకు జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ లేఖ

-

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు మరోసారి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథార్టీ తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథార్టీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత.. వైఫల్యానికి గల కారణాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు సమాచారమివ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని లేఖలో పేర్కొంది. జాతీయ అథార్టీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి.. వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది.

మేడిగడ్డ బ్యారేజి కుంగడం, పియర్స్‌ దెబ్బతినడంతో జాతీయ అథార్టీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులోని అంశాలతో నవంబరు ఒకటిన రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి.. కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి లేఖ రాశారు. మేడిగడ్డ ప్లానింగ్‌, డిజైన్‌, నాణ్యత, నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో తెలుసుకొని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీకి సమాచారం ఇవ్వాలని, బాగు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కూడా తమకు తెలపాలంటూ నవంబరు 24న లేఖ రాయగా దానికి స్పందన రాకపోవడంతో తాజాగా మరో లేఖ సంధించింది.

Read more RELATED
Recommended to you

Latest news