ఈనెల 15న తెలంగాణలో మరో 9 వైద్యకళాశాలలు ప్రారంభం

-

తెలంగాణ వైద్య విద్యార్థులకు.. వైద్యవిద్య చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వైద్య విద్య అభ్యసించడానికి ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. రాష్ట్రంలోనే వీలైనన్ని ఎక్కువ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ దిశగా చర్యలు కూడా షురూ చేసింది. ఇందులో భాగంగానే జిల్లాలకు ఒక మెడికల్ కళాశాలను ప్రారంభించే యోచన చేసింది.

ఇందులో భాగంగా.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 9 మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, భూపాలపల్లి, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో.. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. వైద్యకళాశాలల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో హరీశ్‌రావు స్పష్టం చేశారు.

రాష్ట్ర విద్యార్థులకు వైద్యవిద్యను చేరువచేయటంతోపాటు.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో జిల్లాకి ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు. గతేడాది ఒకే వేదిక నుంచి కేసీఆర్ 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news