హరితహారంలో భాగంగా పెట్టిన కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ
సమావేశాల్లో భాగంగా మంత్రులు ఆయా శాఖల పద్దలను ప్రవేశపెట్టారు. వీటిపై శాసనసభలో చర్చ
జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో 200 కోట్ల చెట్లను పెట్టామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతం ఏడు శాతం పెరిగిందని తెలిపారు.
దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో హరితహారంలో భాగంగా 200 కోట్ల మొక్కలు నాటామని చెబుతున్నారని, అందులో ఆక్సిజన్ పీల్చి కార్బన్ డై ఆక్సెడ్ వదిలే హానికరమైన కోనోకార్పస్ మొక్కలు కూడా ఉన్నాయని తెలిపారు. వాటి మీద కనీసం పిచ్చుకలు కూడా వాలడానికి ఇష్టపడవని చెప్పారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అవి కొన్ని మొక్కలు మాత్రమే కలిశాయని, పెరిగిన 7 శాతంలో అవి తక్కువేనని చెప్పారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. కొన్ని కాదు, పెద్ద మొత్తంలో అవే ఉన్నాయని, హైవే రోడ్ల వెంట, డివైడర్లపై కూడా అవే ఉన్నాయని చెప్పారు.