త్వరలో తెలంగాణలో బీజేపీ బీసీ గర్జన సభ.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

-

తెలంగాణలో ఈసారి కేసీఆర్​ను ఎలాగైనా గద్దె దించి.. కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా చర్యలు చేపడుతూ.. ఎన్నికలకు పటిష్ఠ ప్రణాళికను రచిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తూ.. మరోవైపు ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే మూడో వంతు స్థానాలకు అభ్యర్థులను గుర్తించిన పార్టీ హైకమాండ్.. కొందరి విషయంలో మళ్లీ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో ముఖ్య నేతలందర్నీ బరిలో దింపాలని గతంలో భావించినప్పటికీ, ఇప్పుడు ఈ అంశంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరోవైపు అభ్యర్థుల జాబితాలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్​లు బీసీలక సరైన సీట్లు కేటాయించకపోవడంతో.. వారి ఓట్లను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 40కు పైగా సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జాబితా ప్రకటించగానే రాష్ట్రంలో బీసీ గర్జన సభ నిర్వహించాలని కమలదళం యోచిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనుకుంటోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు కేంద్రమంత్రి అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారని వెల్లడించాయి

Read more RELATED
Recommended to you

Latest news