కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. HCU విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఇవాళ నల్గొండ జిల్లా మర్తినేని గూడెం మాజీ సర్పంచ్ బండి మీది రామును అక్రమంగా పోలీస్ స్టేషన్ లో నిర్భందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా ఎంత మంది పై కేసులు పెట్టుకుంటూ వెళ్తారు రేవంత్ రెడ్డి గారు..? అని నిలదీశారు.సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా..? ఇదెక్కడి ప్రజాస్వామ్యం..? ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని.. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని.. ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో నిలదీసి మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.