సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాద్యాయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ అధికారులతో కలిసి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ను భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఒడిశాలో సింగరేణి విస్తరణ తెలంగాణకు గర్వకారణం అన్నారు. ఇది సింగరేణికి మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ఆనందకర సందర్భం అన్నారు. సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ బ్లాక్ ప్రారంభం తొలి మెట్టు అని, ప్రజా పాలనలోనే నైనీ బొగ్గు బ్లాక్ పై ప్రత్యేక చొరువ తీసుకున్నట్టు వెల్లడించారు.
ప్రజా పాలనలో ఇతర రాస్ట్రాలకు సింగరేణి ని విస్తరిస్తామన్నారు. బొగ్గు గని ఏర్పాటుకు సహకరించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ కి భట్టి ధన్యవాదాలు తెలిపారు. తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించిన సింగరేణికి ఈ సందర్భంగా భట్టి అభినందనలు తెలిపారు.