కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది – మధుయాష్కి గౌడ్

-

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన సంపన్న తెలంగాణ రాష్ట్రం ముదనష్టపు బీఆర్ఎస్ పాలనలో అప్పులు కుప్పగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పల్లో మునిగిపోయిందని సాక్ష్యాత్తు కాగ్ చెబుతోందని తెలిపారు మధుయాష్కి గౌడ్.

బడ్జెట్ రుణాలు, గ్యారంటీలు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా అప్పుల్లో ముంచేశాయన్నారు. తెచ్చిన అప్పులు ఏ కలుగులో ఉన్నాయో.. ఎవరి బొక్కసంలో భద్రంగా ఉన్నాయో ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇవన్నీ ప్రగతి భవన్ నేలమాళిగలో దాక్కున్నాయి కాబట్టే దేశమంతా ఎన్నికల ఖర్చును భరిస్తాననే స్థాయికి కేసీఆర్ అవినీతి చేరిందని మండిపడ్డారు.

తెలంగాణ వచ్చినప్పటినుంచి గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలని తాగుడుకు బానిసలు చేసి.. రక్తమాంసాలను సైతం పీక్కుతిని 2 లక్షల కోట్ల రూపాయాలుగా మార్చుకున్నాడని ఆరోపించారు. అసరా పింఛన్ల రూపంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విగిల్చిన ముష్టి కేవలం 68 వేల కోట్ల రూపాయాలు మాత్రమేనన్నారు.

తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిట్టనిలువునా చంపేసి.. కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల వంటి మూడు చెక్ డ్యాములు కట్టి.. లక్ష కోట్ల రూపాయాలను కేసీఆర్ దోచేశాడన్నారు. కాళ్లేశ్వరం నీళ్లు అని చెబుతున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, పొలాలకు నీళ్లు తీసుకెళ్లే డిస్టిబ్యూటరీ కెనాల్స్ ను ఎక్కడైనా ఏర్పాటు చేశాడా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భూములకు పారుతున్న నీళ్లన్నీ నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులేనని అన్నారు మధుయాష్కి గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news