కోర్టు ధిక్కరణ నోటీసులు.. అజారుద్దీన్‌కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

-

టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసులు సవాల్‌ చేస్తూ అజహరుద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ఇది కేవలం ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ చేసిన అభ్యర్థన మాత్రమేనని, ఈ దశలో తాము పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లీగ్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు తమను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అప్పట్లో దీనిపై విచారణ జరిపిన కోర్టు 2021-22 లీగ్‌ మ్యాచ్‌లకు నల్గొండ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ను అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్‌సీఏ అనుబంధ జట్టుగా ఉన్న తమను భవిష్యత్తులో అన్ని సమావేశాలు, మ్యాచ్‌లు, టోర్నమెంట్‌లకు అనుమతించేలా హెచ్‌సీఏతో పాటు, అప్పటి అధ్యక్షుడు అజహరుద్దీన్‌, బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని ఎన్డీసీఏ అభ్యర్థించింది. దీనిపై గతేడాది విచారణ జరిపిన కోర్టు నల్గొండ క్రికెట్‌ అసోసియేషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పును హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగా పాటించట్లేదని ఎన్డీసీఏ.. తెలంగాణ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టు అజహరుద్దీన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

దీనిపై జూన్‌ 23న కోర్టుకు హాజరైన తన స్పందన తెలియజేయగా సంతృప్తి చెందని హైకోర్టు.. ఆగస్టు 4న మరోసారి కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అక్కడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news