ఈనెల 4న దిల్లీలో తెలంగాణ భవన్‌ ప్రారంభం

-

జాతీయస్థాయిలో హవా చాటేందుకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మరింత వేగంగా దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా దిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని (తెలంగాణ భవన్‌) ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఉదయం దిల్లీకి ఆయన వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ దిల్లీకి పయనమయ్యారు.

‘దిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి ఇక్కడి నడిబొడ్డున బీఆర్ఎస్ సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం పనులను సంతోష్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version