TSPSC పేపర్ లీక్​లో ఐటీ అంశాల దర్యాప్తునకు మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌కు వెళ్తారా? : హైకోర్టు

-

TSPSC పేపర్ లీక్​పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సిట్‌ దర్యాప్తు సరిగా జరగడం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు రద్దు, వాయిదా సబబేనని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.

సిట్ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి, మంత్రి కేటీఆర్‌ జోక్యం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. మంత్రి చెప్పినట్లే సిట్‌ దర్యాప్తు చేస్తోందని.. లీకేజీలో ఇద్దరికే ప్రమేయం ఉందని కేటీఆర్‌ ముందే చెప్పారని తెలిపింది. ఐటీ అంశాలపై దర్యాప్తునకు సిట్‌లో సాంకేతిక నిపుణులు లేరని కోర్టుకు వెల్లడించారు.

మరోవైపు విచారణలో భాగంగా ఇప్పటివరకు సిట్‌ 40 మంది సాక్షులను ప్రశ్నించిందని ప్రభుత్వం తరఫున హైకోర్టుకు ఏజీ తెలిపారు. 12 కంప్యూటర్లను సిట్‌ సీజ్‌ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఐటీ అంశాల దర్యాప్తునకు సిట్‌లో ఐటీ నిపుణులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  ఐటీ అంశాల దర్యాప్తునకు మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌కు వెళ్తారా? అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news