తెలంగాణపై ఎలాంటి చర్యలొద్దు.. కేంద్రానికి హైకోర్టు ఆదేశం

-

విద్యుత్ బకాయిల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్‌ బకాయిలను చెల్లించే విషయమై.. తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి మొత్తం రూ.6,756.92 కోట్లను (బకాయిలు రూ.3,441.78 కోట్లు, చెల్లింపుల్లో జాప్యం చేసినందుకు సర్‌ఛార్జి తదితరాలు రూ.3,315.14 కోట్లు కలిపి) 30 రోజుల్లో చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు వేర్వేరుగా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశాయి.

వీటిపై జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యుత్‌ సంస్థల వాదనను వినకుండా కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం ప్రాథమికంగా చట్ట ఉల్లంఘనేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్‌ సంస్థలను ఆదేశిస్తూ.. విచారణను అక్టోబరు 18వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version