సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

-

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లాల్లో మంత్రులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

హైదరాబాద్​లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో.. మండలి ఛైర్మన్‌, సభాపతి, మంత్రులు, ఉపసభాపతులు, చీఫ్ విప్‌లు, విప్‌లు, ఇతర ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని పతాకావిష్కరణ చేసే వారి పేర్లు ఖరారు చేసి సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటలకు పతాకావిష్కరణ చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఓవైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కేసీఆర్.. తన మజ్లిస్ దోస్తులను ఇంప్రెస్ చేయడానికే విమోచన దినోత్సవం జరపడం లేదని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news