కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ మరణం మరో ఉదాహరణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అనారోగ్యంతో మరణించాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతున్న నిఖిల్ అనే విద్యార్థి మరణం చాలా బాధాకరమన్నారు.
ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడినీ ప్రార్థించారు. అలాగే 83 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే కూడా కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్స్యానికి ఈ మరణం మరో ఉదాహరణ అని దుయ్యబట్టారు. చిన్న జ్వరానికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. గురుకులంలో 400 మంది విద్యార్థులనే సమర్థవంతంగా చూసుకోలేని ప్రభుత్వం 2000 మంది ఉండే ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్వహణను ఎలా చేయగలదు అని నిలదీశారు.