హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మూడు కేసులు

-

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఉప్పల్‌ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే వ్యవహారంపై హెచ్​సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్‌, మాజీ కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌పై రెండు చొప్పున కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకతవకలతో సంబంధం ఉన్న ఫైర్‌ విన్‌ సేఫ్టీ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సారా స్పోర్ట్స్‌, బాడీ డ్రెంచ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎక్సలెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర నాలుగు సంస్థల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అగ్నిమాపక సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. అప్పట్లో న్యాయస్థానం నియమించిన జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ పర్యవేక్షక కమిటీ దృష్టికి రాకుండానే కాంట్రాక్టు ఇచ్చారని తెలిపారు. బంతుల కొనుగోళ్లకు సంబంధించి హెచ్‌సీఏకు రూ.57.07 లక్షలు, బకెట్‌ కుర్చీల కొనుగోళ్లలో ధరల పెంపుతో రూ.43.11 లక్షల నష్టం వాటిల్లిందని.. జిమ్‌కు సంబంధించి ట్రెడ్‌మిల్‌, ఇతర సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు అండర్‌-19, అండర్‌-23 జట్లలో చోటు కోసం నకిలీ పత్రాలు సమర్పించారని.. ముగ్గురు క్రీడాకారులపై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. హెచ్‌సీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీల్‌ కంటే ఫిర్యాదుతో మూడు కేసులు నమోదు చేసినట్లు మల్కాజ్‌గిరి డీసీపీ జానకి తెలిపారు. క్రీడాకారులు లితిక్‌ కార్తీక్, శషాంక్‌ మల్హోత్రా, మహ్మద్‌ బిన్‌ హుస్సేన్‌లతో పాటు వారికి నకిలీ జనన ధ్రువపత్రాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ సహాయ వైద్యాధికారులు డాక్టర్‌ అజీజ్‌ ఖాసీం, డాక్టర్‌ కె.వెంకటేశ్వరరెడ్డిపైనా. కేసులు నమోదు చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news