కేసీఆర్ అప్పుల రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టిండు – టీపీసీసీ చీఫ్

-

9 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్. సోమవారం కుత్బుల్లాపూర్ లో ఖమ్మం వరద బాధితులకు నిత్యవసర సరుకులు తీసుకు వెళ్లే వాహనాలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులకు మైనంపల్లి హనుమంతరావు నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేస్తున్నాయని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టి పోయాడని మండిపడ్డారు. తాము ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం మనదే.. మరింత కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news