RTC ఉద్యోగులకు కోటి రూపాయాల ప్రమాద బీమా..యూబీఐ ఒప్పందం !

-

తమ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూబీఐతో TSRTC ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారని చెప్పారు. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు.

గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు. సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చిందని, ఈ ఖాతా ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉందని చెప్పారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఈ ఉచిత ప్ర‌మాద బీమా ఆసరాగా నిలుస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు గుర్తు చేశారు. యూబీఐ ఉచిత ప్రమాద బీమాపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, యూఎస్ఎస్ఏ ఖాతాలో ఉందో.. లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రూపే సెలక్ట్ కార్డును తీసుకుని, దానితో లావాదేవీలు చేసుకోవాలని, అప్పుడే రూ.12 లక్షల ప్రమాద బీమాను పొందగలుగుతారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news