ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను తరలిస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాల నుంచి ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగించిందని, నదీ జలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోతుంటే రేవంత్ సర్కారు చలనం లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంట పొలాలను ‘ఎండబెట్టిందని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో.. ఒక్కొక్కటిగా అన్నింటినీ కాంగ్రెస్ గంగలో కలుపుతోందన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోని త్రీమెన్ కమిటీ దిక్కులేదు, సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలుపుతుంటే.. కాంగ్రెస్ నేతలు విమర్శించారు.