తిరుమల ఏప్రిల్‌ సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ !

-

కలియుగ వైకుంఠం… తిరుమల శ్రీవారి వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటా టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన మొత్తం 65,280 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. కరెంట్‌ బుకింగ్‌ కింద 54,600, ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,680 సేవా టికెట్లు ఇందులో ఉన్నాయి. సుప్రభాతం 7,920, విశేషపూజ 1,500, తోమాల సేవ 140, అర్చన 140, అష్టాదళ పాదపద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300 టికెట్లను లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలోని విశేష పూజ 1,500, వసంతోత్సవం 13,200, కల్యాణోత్సవం 12,825, సహస్ర దీపాలంకరణ సేవ 15,600 టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్టు టీటీడీ తెలిపింది. లాటరీ విధానంలో కేటాయించే టిక్కెట్ల కోసం శుక్రవారం ఉదయం 10 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో భక్తులను ఎంపిక చేసి టిక్కెట్లను కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించే టిక్కెట్లకు ముందుగా భక్తులు తమ పేర్లను నమోదుచేసుకోవాలి. మంగళవారం ఉదయం 10 గంటల్లోగా పేర్లను నమోదుచేసుకున్న భక్తులకు డిప్ విధానంలో టిక్కెట్లు కేటాయిస్తారు.

డిప్‌ ద్వారా టిక్కెట్ల పొందిన భక్తుల మొబైల్స్‌కు సమాచారం ఇస్తారు. వీరు ఆన్‌లైన్ నగదు చెల్లించి టిక్కెట్లను ఖరారు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరి కింద విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను విడుదల చేసిన వెంటనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లాలనుకునేవారు తక్షణమే ఆర్జిత సేవల టికెట్లను బుక్‌ చేసుకుంటే వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news