ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను తీసుకురావడం సహజం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం స్కీం ను అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం, దీనిని అమలులోకి తీసుకువచ్చారు.ఈ పథకంలో భాగంగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం అర్హులు మరియు అనర్హుల జాబితాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తల్లికి వందనం స్కీంలో భాగంగా, 1వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేసింది.
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, ఈ పథకం ద్వారా 15 వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 2000 రూపాయలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాకు జమ చేయబడతాయి. మిగిలిన 13 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లోకి నేరుగా డిపాజిట్ చేయబడతాయి. గ్రామ సచివాలయాల్లో అర్హులు మరియు అనర్హుల జాబితాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి అభ్యంతరాలను జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదుగా స్వీకరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత తిరిగి అర్హులను గుర్తించి మరో జాబితాను రూపొందించి జూన్ 21 నుండి 28 తేదీల మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ పధకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందాలంటే, ఆదాయం పదివేల లోపు ఉన్న తెల్ల రేషన్ కార్డు దారులు అర్హులు. అలాగే, నెలకు 300 యూనిట్ల కరెంటు బిల్లు కంటే తక్కువగా వినియోగించేవారు కూడా ఈ స్కీమ్కు అర్హులు. తల్లికి వందనం స్కీం లో ప్రయోజనాలను పొందాలంటే, విద్యార్థులకు 75% హాజరు ఉండాలి. అలాగే, ఇంట్లో ఫోర్ వీలర్ లేని కుటుంబాలే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని కూడా ప్రోత్సహిస్తోంది.