ఇకపై IRTCలో డిఫాల్ట్‌గానే రూ.10 లక్షల బీమా..!

-

రైల్వే ప్రయాణాలు సురక్షితమే అయినప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది ప్రత్యేకంగా లైఫ్‌ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ రైలు టికెట్‌ బుక్‌ చేసుకునేప్పుడు మనకు బీమా సదుపాయం కూడా ఉంటుంది. మీరు అసలు ఈ విషయం గమనించే ఉండరు. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్‌ సాయంతో రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే. కానీ, టికెట్‌ బుక్‌ చేసుకొనే తొందరలో ప్రమాద బీమాను ఎంపిక చేసుకోవటం మరచిపోతుంటారు.

IRCTC
IRCTC

దీంతో ఏదైనా జరగరానిది జరిగితే బీమా ప్రయోజనాలకు దూరమవుతారు. బాలేశ్వర్‌ రైలు ఘటననే ఉదాహరణగా తీసుకుంటే.. ఆ రైల్లోని చాలా మంది ప్రయాణికులు బీమాను ఎంపిక చేసుకోలేదు. దీంతో అందరి ప్రయాణికులకు బీమా సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇండియన్‌ రైల్వే టికెట్‌ బుకింగ్‌లో చిన్న మార్పు చేసింది. కేవలం 35 పైసలకే లభించే బీమా సదుపాయాన్ని డిఫాల్ట్‌ చేసింది.

ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో వెబ్‌సైట్‌/యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసుకొనే సమయంలో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ పక్కనున్న టిక్‌ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకొనే పని లేదు. ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్‌సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది. దీంతో టికెట్లు అయిపోతాయేమో అనే తొందరలో బీమా సదుపాయాన్ని ఎంపిక చేసుకోలేదని బాధపడాల్సిన పనిలేదు. అయితే ఈ ప్రయోజనాలను వద్దూ అనుకున్నవారు మాత్రం ఆ టిక్‌ మార్క్‌ను తీసేయచ్చు. కానీ తెలివి ఉన్నవాళ్లు కావాలని వద్దూ అనుకోరు కదా..! 35 పైసలకు పోయేదేం ఉంది చెప్పండి. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నియమాల ప్రకారం.. ఏ సంస్థా బీమాను డిఫాల్ట్‌గా ఇవ్వరాదు. ఐఆర్‌సీటీసీకి మాత్రం ఆ వెసులుబాటు ఇచ్చింది.

ఇంతకీ ఈ బీమా ప్రయోజనాలు ఏంటో..?

ఈ బీమాను ఎంచుకుంటే ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం లభిస్తుంది.

రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా శారీరక వైకల్యం ఏర్పడి మరే పనీ చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తారు.

తీవ్రంగా గాయపడి శారీరక వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందొచ్చు.

క్షతగాత్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు.

నామినీ జత చేయాలి

బీమా పాలసీని ఎంచుకున్న ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది. నామినీదారు లేదా ప్రయాణికులు ఈ బీమాను క్లెయిం చేసుకోవాలనుకుంటే సంబంధిత పత్రాలను తీసుకొని దగ్గర్లో ఉన్న బీమా సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లో బీమా తీసుకున్న వ్యక్తి వీటి ప్రయోజనాలను పొందుతారు. ఒకవేళ నామినీ వివరాలు అందించకపోయినా, నామినీ వ్యక్తి చనిపోయినా వారసులు ఈ బీమా ప్రయోజనాలు పొందవచ్చు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. మీరు కూడా పదిమందికి వీటిగురించి చెప్పండి.!

Read more RELATED
Recommended to you

Latest news