కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత…ఎఫ్‌డీసీ కీలక నిర్ణయం

-

కరోనా విపత్తు నేపథ్యంలో ఓ వైపు ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్లు దొరకకపోగా మరోవైపు కొన్ని స్మశానాల్లో కూడా దహనానికి కూడా స్థలం దొరకడం లేదు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఊరటనిచ్చే అంశం. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ స్మశానాల్లో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దీనిపై స్పందించింది. తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.

కాగా ఫారెస్ట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్రతీ యేటాపెద్ద ఎత్తున ప్లాంటేషన్ చేపడుతారు. ఈ కలపను కార్పోరేషన్ నుంచి పేపర్ మిల్లులు సేకరిస్తాయి. ఇలా అమ్మగా మిగిలిన సుమారు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్ తో సహా సమీప మున్సిపాలిటీల స్మశానాలకు మృతదేహాలను కాల్చేందుకు సరఫరా చేస్తామని ఎఫ్‌డీసీ ప్రకటించింది. ఎక్కువ సంఖ్యలో మరణాలు, అదే సమయంలో స్మశానాలకు సరిపడా కలప దొరకటం లేదన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెరిగిన కలప ధరలు కూడా పేదలకు భారంగా పరిణమించటంతో మానవతా దృక్పథంలో సహాయం చేయాలన్న ఆలోచనతో 20 లక్షల రూపాయల విలువైన కలపను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చామని ప్రతాప్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, మిగతా పట్టణాల్లో స్థానిక మున్సిపల్ అధికారులను సమన్వయం చేసుకొని కలపను అందించే ఏర్పాట్లు చేస్తామని కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎం.డీ జీ. చంద్రశేఖర రెడ్డి తెలిపారు. రంగారెడ్డి డివిజన్ లో 3,500 టన్నుల కలప, ఖమ్మం-సత్తుపల్లి- అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్లలో 4,000 టన్నులు, మంచిర్యాల- కాగజ్ నగర్ లలో 860 టన్నులు, వరంగల్ డివిజన్ లో 200 టన్నుల కలప అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అంత్యక్రియలకు అవసరమైన వెదరును కూడా సరఫరా చేస్తామని ఎఫ్‌డీసీ తెలిపింది.

ఇక హైదరాబాద్ పరిధిలో అంబర్ పేట, బన్సీలాల్ పేట, ఆసిఫ్ నగర్, ఈ.ఎస్.ఐ స్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామని తెలిపారు. తమ వారి అంత్యక్రియలకు అవసరమైన కలప లభ్యత లేని పేదలు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్లు కూడా ముందుకు వచ్చినట్లు చంద్రశేఖర రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news