ట్విటర్‌లో కోత షురూ.. 200 మంది భారతీయులు ఇంటికి..!

-

ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు చేస్తాడని తెలిసినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. తాను ట్విటర్ కొంటే సగం మంది ఉద్యోగాలు తొలగిస్తానని చెప్పడంతో వారిలో భయం ఇంకా ఎక్కువైంది. ఎట్టకేలకు మస్క్ ట్విటర్​ను సొంతం చేసుకున్నారు. చెప్పినట్టుగానే కోతలు షురూ చేశారు. ట్విటర్ ఉద్యోగుల పీడ కలే నిజమవుతోంది. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న మస్క్.. 200 మందికిపైగా భారతీయులను ఇంటికి పంపించినట్లు సమాచారం.

మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్‌ ఇంజినీరింగ్‌, సేల్స్‌ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.

ట్విటర్‌ నుంచి తొలగిస్తున్నట్టు మెయిల్‌ అందుకున్న ఓ 25 ఏళ్ల యువకుడు కంపెనీ నుంచి తనను తొలగించడంపై సానుకూలంగా స్పందించాడు. ‘బర్డ్‌ యాప్‌ నుంచి ఇప్పుడే ఉద్వాసనకు గురయ్యా. ఇది గౌరవప్రదంగా భావిస్తున్నా. ఈ బృందంతో కలిసి పని చేసినందుకు గర్వపడుతున్నా. పని చేసే చోటును ప్రేమిద్దాం. లవ్‌ ట్విటర్‌’ అంటూ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ట్వీట్‌ చేసిన గంటలోనే 3,300 మంది లైక్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news