ఐదేళ్లలో 42% పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

-

గత ఐదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గిందని కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు పలు వివరాలతో సమాధానమిచ్చారు. 2018 జనవరి 1 నాడు 14.2 కేజీల గృహావసర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.741 ఉండగా, 2023 ఫిబ్రవరి 1 నాటికి అది రూ.1,053 (42.10%)కి చేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఎల్‌పీజీపై కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ 2017-18లో రూ.23,464 కోట్లమేర ఉండగా, 2021-22లో అది రూ.1,811 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఐదేళ్లలో ఎల్‌పీజీ సబ్సిడీ పొందే వారి సంఖ్య 20,21,20,070 నుంచి 28,36,77,886 (40.35%పెరుగుదల)కి చేరినట్లు తెలిపారు.

పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయం గత ఐదేళ్లలో 46% పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం మాత్రం 36% మాత్రమే పెరిగిందని సహాయమంత్రి రామేశ్వర్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.31,21,173 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.19,65,891 కోట్లు చేరగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.11,55,282 ఆదాయం చేకూరినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news