మరికొన్ని నెలల్లో తెలంగాణ సంబురం వినాయక చవితి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి విగ్రహాల తయారీ షురూ అయింది. ఇక తెలంగాణలో గణేశ్ చతుర్థి అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి. ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 61 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం వినాయక విగ్రహ ఏర్పాటు మండపం వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డిలతో కలిసి ఉత్సవ కమిటీ ప్రతినిధులు వేదమంత్రాల మధ్య ‘కర్ర పూజ’ (తొలిపూజ) చేశారు.
‘‘గతేడాది వరకు ఉత్సవాలను పర్యవేక్షించిన సింగరి సుదర్శన్ దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు గతేడాది మాదిరిగానే 69వ ఏటా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించనున్నాం. సెప్టెంబరు మూడో వారంలో వినాయక చవితి ఉంది. పండగకు నాలుగు రోజుల ముందుగానే విగ్రహం పూర్తవుతుంది. పనులను వారం పది రోజుల్లో ప్రారంభిస్తాం. ఆ తర్వాత విగ్రహ నమూనాను ప్రకటిస్తాం’’ అని ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు.