యాచారంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి యాచారం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.సీఐ శంకర్ కథనం ప్రకారం.. గోడుకొండ్ల గ్రామ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో నివసించే భాస్కర్ (42) కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
నిన్న కూరగాయలను తీసుకొని గట్టుప్పల్ అంగడిలో విక్రయించి తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా.. పాత మాల్ కూడలి వద్ద మర్రిగూడ వైపు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుడి వైపు కూర్చున్న భాస్కర్ తీవ్రంగా గాయపడగా..స్థానికులు అతన్ని పద్మావతి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.