తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెటిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్ మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి రానున్నారు. గురువారమే ఎంపీ రఘునందన్ రావుకి భద్రత పెంచాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇటీవలే రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చిన విషయం విధితమే.
దీనిపై విచారణ చేపట్టిన పోలీస్ శాఖ మెదక్ ఎంపీకి భద్రత అవసరం అని నిర్ధారణకు వచ్చింది. ఇకపై రఘునందన్ రావు పర్యటనలో ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ ఎంపీ నియోజకవర్గంలోని ముగ్గురు ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఎంపీ రఘునందన్ రావు ఆసుపత్రిలో చేరాడనే విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి ఎంపీ రఘునందన్ రావు ఇవాళ ఆసుపత్రిలో చేరడంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడుతున్నారు.