తిరుమలలో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రత్యేకతలు..

-

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఒక ప్రత్యేకమైన, పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. కోయిల్ అంటే గుడి ఆళ్వార్ అంటే భక్తుడు తిరుమంజనం అంటే శుద్ధి చేయడం లేదా పవిత్ర స్నానం చేయించడం అని అర్థం. అంటే, ఈ కార్యక్రమం ద్వారా ఆలయాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి పవిత్రంగా ఉంచుతారు. సాధారణంగా పెద్ద పండుగలు లేదా ముఖ్యమైన పర్వదినాలకు ముందు ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ సంవత్సరము సెప్టెంబర్ 16 న ఉదయం 6 గంటలకు తిరుమలలో ఈ కార్యక్రము
జరుగుతుంది. ఇది భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ఆలయాన్ని సిద్ధం చేస్తుంది.

ఆలయంలో నిత్యం జరిగే పూజలు, ఉత్సవాలు వేలాది మంది భక్తుల రాకపోకల వల్ల ఆలయ గోడలు పైకప్పు, పూజాసామగ్రిపై దుమ్ము ధూళి పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన అపరిశుభ్రతను తొలగించి ఆలయాన్ని పూర్తిగా పరిశుభ్రం చేయడానికి ఈ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ శుద్ధి కార్యక్రమం శ్రీవారి గర్భాలయం నుండి బంగారు వాకిలి వరకు, ఉప ఆలయాలు, పూజాసామగ్రి, గోడలు, పైకప్పు ఇలా ఆలయంలోని ప్రతి మూలనూ శుభ్రపరుస్తారు. ఇది ఆలయ పవిత్రతను కాపాడటానికి, దేవతామూర్తులను శుద్ధి చేయడానికి జరుగుతుంది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రత్యేకతలు: ఈ కార్యక్రమాన్ని సంవత్సరంలో నాలుగు ముఖ్యమైన పర్వదినాల ముందు నిర్వహిస్తారు. ఉగాది,ఆణివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవాలు,వైకుంఠ ఏకాదశి నాడు నిర్వహిస్తారు.

Unique Traditions of Koil Alwar Thirumanjanam at Tirumala
Unique Traditions of Koil Alwar Thirumanjanam at Tirumala

పవిత్ర పరిమళ ద్రవ్యాలు: శుద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆలయంలోని ప్రతి గోడ, పైకప్పు ఉపాలయాలు, ఇతర ప్రాంతాలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఈ ద్రవ్యాలలో నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటివి ఉంటాయి.

మూలవిరాట్టుకు రక్షణ: తిరుమంజనం సమయంలో శ్రీవారి మూలవిరాట్టుకు దుమ్ము, ధూళి పడకుండా ఒక ప్రత్యేక వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ వస్త్రాన్ని తొలగించి స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ: సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ముందు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేయడం ద్వారా భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన వాతావరణంలో శ్రీవారి దర్శనం లభిస్తుంది. సెప్టెంబర్ 23 న సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ముఖ్యంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సిద్ధం చేస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల ఆలయానికి అత్యంత ముఖ్యమైన ఉత్సవం. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో శ్రీవారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాల ముందు ఆలయాన్ని శుభ్రపరచడం ద్వారా శ్రీవారికి, భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news