చాణక్య నీతి కేవలం రాజులకు మాత్రమే కాదు, సామాన్యులకు కూడా జీవన మార్గదర్శి. స్నేహానికైనా, బంధుత్వానికైనా ఒక హద్దు ఉంటుందని ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పారు. “మనల్ని పిలిచారు కదా” అని వెళ్లే ప్రతి చోట గౌరవం దక్కదు. ఒక్కోసారి పిలవని చోటుకి వెళ్లడం వల్ల ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే కాకుండా, ప్రమాదాల్లో కూడా చిక్కుకోవచ్చు. మరి ఎంతటి సన్నిహితులు పిలిచినా ఏ ప్రదేశాలకు వెళ్లకూడదో తెలుసుకుందాం..
గౌరవం లేని చోటు: చాణక్యుడి ప్రకారం, ఎక్కడైతే మీకు కనీస గౌరవ మర్యాదలు లభించవో, అటువంటి చోటుకి వెళ్లడం మూర్ఖత్వం. మీ రాకను ఎవరైతే భారంగా భావిస్తారో లేదా మిమ్మల్ని చిన్నచూపు చూస్తారో, వారు ఎంతటి ఆప్తమిత్రులైనా సరే అక్కడికి వెళ్లకపోవడమే మంచిది. ఆత్మగౌరవం లేని చోట బ్రతకడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడమే.
క్రమశిక్షణ లేని ప్రదేశం: నియమ నిబంధనలు లేని చోటుకి లేదా అధర్మం రాజ్యమేలే ప్రదేశానికి వెళ్లకూడదు. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. శాంతి లేని చోట ఎంతటి విందు భోజనం పెట్టినా, అది మన మనసుకి ప్రశాంతతను ఇవ్వదు. పైగా అటువంటి చోట్ల గొడవలు జరిగితే అనవసరంగా మనం కూడా బాధ్యులం కావాల్సి వస్తుంది.

చాణక్యుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భయం ఉన్న చోట నివసించకూడదు, వెళ్లకూడదు. ఎక్కడైతే ప్రజలకు చట్టం పట్ల భయం ఉండదో ఎక్కడైతే దుర్మార్గుల ఆగడాలు ఎక్కువగా ఉంటాయో అలాంటి చోట అడుగు పెట్టడం ప్రమాదకరం. మీ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేని చోటుకి స్నేహితులు పిలిచారని వెళ్లడం సమంజసం కాదు.
మనం ఉండే చోట లేదా వెళ్లే చోట ఏదైనా నేర్చుకునే అవకాశం ఉండాలి లేదా ఎదగడానికి మార్గం ఉండాలి. విజ్ఞానం, ఉపాధి దయ మరియు సంస్కారం లేని చోట ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అటువంటి ప్రదేశాలు మనిషి ఎదుగుదలను కుంటుపరుస్తాయి.
