మనం బయట హోటళ్లలో లేదా రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే బజ్జీలు, సమోసాలు, పూరీలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ, చాలా చిన్న హోటళ్లలో ఒకసారి వాడిన నూనెను పారబోయడానికి ఇష్టపడరు. ఖర్చు మిగులుతుందని అదే నూనెను మళ్లీ మళ్లీ కాగబెట్టి వాడుతుంటారు. ఇలా పదే పదే మరిగించిన నూనెతో చేసిన పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది.
రుకో (RUCO) పథకం అంటే ఏంటి?: ఇలాంటి ప్రమాదకరమైన అలవాటుకు చెక్ పెట్టడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి ‘రుకో’ అనే సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇక వాడేసిన వంట నూనెను మళ్లీ ఆహార తయారీలో వాడకుండా, దాన్ని వేరే మంచి పనికి ఉపయోగించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
నూనె ఇస్తే.. డబ్బులు ఇస్తారు: ఈ స్కీమ్ కింద హోటళ్లు లేదా రెస్టారెంట్ల యజమానులు తాము ఒకసారి వాడేసిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఏజెంట్లు నేరుగా వచ్చి ఆ వాడిన నూనెను సేకరిస్తారు. ఇక అలా ఇచ్చిన నూనెకు లీటర్ల లెక్కన హోటల్ నిర్వాహకులకు కొంత డబ్బు కూడా చెల్లిస్తారు. దీనివల్ల హోటల్ నడిపేవారికి నష్టం రాకుండా అదనపు ఆదాయం లభిస్తుంది.

బయోడీజిల్గా మారే వంట నూనె: మరి ఇలా సేకరించిన నూనెను ఏం చేస్తారో తెలుసా? ఈ నూనెను సురక్షితంగా ఫ్యాక్టరీలకు తరలించి దానిని ‘బయోడీజిల్’ (ఇంధనం) గా మారుస్తారు. ఇక అంటే మనం వాడేసిన పాత నూనె వాహనాలు నడవడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇక దీనివల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది ఇటు పర్యావరణానికి మేలు జరుగుతుంది అలాగే దేశానికి ఇంధనమూ లభిస్తుంది.
ప్రభుత్వం తెచ్చిన ఈ ‘రుకో’ పథకం హోటల్ వ్యాపారులకు మరియు సాధారణ ప్రజలకు ఒక మంచి వరం లాంటిది. చిన్న హోటళ్లు నడిపేవారు ఈ పథకంపై అవగాహన పెంచుకుని వాడిన నూనెను ప్రభుత్వానికి అందించి బాధ్యతగల పౌరులుగా నిలవాలి.
గమనిక: ఇంట్లోనైనా, హోటల్లోనైనా వంట నూనెను గరిష్టంగా 2 లేదా 3 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూనె చిక్కగా మారి, రంగు నల్లగా మారితే దాన్ని వెంటనే వాడటం ఆపేయాలి.
