Vyooham Review : ఆర్జీవీ ‘వ్యూహం’ ఫలించడంతో సంబురాల్లో జగన్ ఫ్యాన్స్

-

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓ ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటికీ వైఎస్సార్ అంటే ప్రాణమిచ్చే అభిమానులెంతో మంది ఉన్నారు. ఆయన మరణ వార్త విని వేల మంది గుండెలు ఆగిపోయాయంటే ఆయన ప్రజలపై ఎంత ప్రభావం చూపారో అర్థమవుతోంది. అందుకే ఆయన రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర సినిమా సూపర్ హిట్ అయింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై ఇటీవల యాత్ర-2 సినిమా తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి.

మరోవైపు తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో అడ్డంకుల మధ్య ఈ సినిమా మార్చి 2వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా?

స్టోరీ ఏంటంటే.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (వీర శేఖర్ రెడ్డి) మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా మొదలవుతుంది. అవుతుంది. వైఎస్సార్‌ మరణానికి ముందు జగన్‌ మోహన్ రెడ్డి (వైఎస్ మదన్ రెడ్డి) అంటే ప్రజలకు పెద్దగా తెలియదు. తండ్రి అడుగుజాడల్లో నడవాలని తపించే మదన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలోనే కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్సార్‌ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులొస్తాయి. వైఎస్సార్ తర్వాత ఏపీ సీఎం ఎవరనే చర్చ మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకున్న మదన్ (అజ్మల్ అమీర్) సీఎం కావాలనుకుంటారు.

150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్‌ పార్టీ (కాంగ్రెస్‌) అధినేత్రి అయిన మేడం (సోనియా) కు రాస్తారు. అదే సమయంలో మదన్‌ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్‌ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్‌ సీఎం కాకుండా ఇంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్‌ ఎలా ప్రజా నాయ‌కుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఈ క్రమంలో ఇంద్రబాబు, శ్రవణ్ కల్యాణ్ల వ్యూహం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మూవీ ఎలా ఉందంటే.. వైఎస్సార్‌ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్‌ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. ఈ క్రమంలో కేంద్రం నుంచి జగన్‌ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై చేస్తున్న ఎదురుదాడులను ఎలా ఎదుర్కొన్నారు? అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు.

ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ. కష్ట సమయంలో వైఎస్‌ జగన్‌ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది.

ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్‌ కల్యాణ్‌ పాత్రకు  కాస్త ప్రయారిటీ ఉంటుంది. వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు. ఈ సినిమాలో వైఎస్‌ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్‌ అయ్యారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా.. సంగీతం మాత్రం అంతగా నప్పలేదు. ఈ మూవీ జగన్, వైఎస్సార్, వైసీపీ ఫ్యాన్స్కు మాత్రం తప్పకుండా నచ్చుతుంది.

టైటిల్‌: వ్యూహం
నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు
నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
సంగీతం: ఆనంద్
సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
విడుదల తేది: మార్చి 2, 2024

రేటింగ్ : 1.5/5

కన్క్లూజన్ : ఒకరికి వినోదం- మరొకరికి విషాదం

Read more RELATED
Recommended to you

Latest news