తీవ్ర ఒత్తిడిలో స్టార్​ హీరో.. 72 గంటలు నిద్రపోకుండా.. అలా చేయోద్దంటూ రిక్వెస్ట్​..

-

గత కొద్దిరోజులుగా బాలీవుడ్​ స్టార్​ హీరోలు ఆమిర్​ఖాన్ ‘లాల్​సింగ్​ చడ్డా​’, అక్షయ్​కుమార్​ ‘రక్షాబంధన్​’ సినిమాలను బాయ్​కాట్​ చేయాలంటూ సోషల్​మీడియా హ్యాష్​ట్యాగ్​ ట్రెండ్ అవుతోంది. వారి సినిమాలు బ్యాన్ చేయాలని కొంతంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ సారి స్పందించి విచారం వ్యక్తం చేసిన ఆమిర్​.. మరోసారి విచారం వ్యక్తం చేశారు. “నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే, అందుకు నేను విచారిస్తున్నాను. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోను. ఎవరైనా సినిమాను చూడకూడదనుకుంటే, వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తాను” అని పేర్కొన్నారు.

దీంతోపాటే ప్రస్తుతం తాను బాగా నెర్వస్​గా ఉన్నట్లు తెలిపారు ఆమిర్​. “ప్రస్తుతం నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను, 48 గంటల నుంచి నిద్రపోలేదు. నేను జోక్ చేయడం లేదు, నిజంగా నిద్ర రావడం లేదు. నా మెదడు బాగా అలసిపోయింది సరిగ్గా పనిచేయట్లేదు. అందుకోసం నేను పుస్తకాలు చదువుతూ, ఆన్‌లైన్‌లో చెస్ ఆడుతున్నా. ఆగస్ట్ 11 తర్వాతే నిద్రపోగలను.” అని అన్నారు.

ఇక ఇదే విషయమై అక్షయ్​కుమార్​ మాట్లాడుతూ.. “బాయ్​కాట్​ చేయొద్దంటూ చేసే ప్రచారాల్లో పాల్గొనమని కోరారు. ఒకవేళ సినిమా చూడటం ఇష్టం లేకపోతే చూడొద్దు. మనది స్వేచ్ఛ కలిగిన దేశం. సినిమా రిలీజ్​ అయింది. చూడాలనుకోవడం, వద్దనుకోవడం మీ ఇష్టం. ఇండస్ట్రీ ఏదైనా అది దేశానికి ఆర్థికపరంగా ఉపయోగపడేదే. కాబట్టి సినిమాలను బాయ్​కాట్​ చేయడమనేది మూర్ఖత్వం” అని అన్నారు.

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఆమిర్​ మాట్లాడుతూ.. “నాపై, నా సినిమాపై ప్రతికూల ప్రచారం జరుగుతున్నందుకు బాధగా ఉంది. నాకు భారత్‌ అంటే ఇష్టం లేదని కొంతమంది అనుకుంటున్నారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. నేను దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు చెప్పేది ఒక్కటే.. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు. నా గురించి అటువంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బాయ్‌ కాట్‌ చేయొద్దు” అని చెప్పుకొచ్చారు.

కాగా, ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ను అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించారు. ఈ కామెడీ డ్రామాలో యువ నటుడు నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇక రక్షాబంధన్​ విషయానికొస్తే.. అక్షయ్‌కుమార్‌, భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకుడు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. నలుగురు అక్కాచెల్లెళ్లకు లాల్‌ కేదార్‌నాథ్‌(అక్షయ్‌) ఒక్కడే అన్నయ్య. వారి బాధ్యతలు పూర్తయ్యే వరకూ తాను పెళ్లి చేసుకోనని, తల్లికి మాట ఇస్తాడు. మరి కేదార్‌నాథ్‌ తన చెల్లెళ్లకు వివాహం చేసేందుకు ఏం చేశాడు? ఎలాంటి కష్టాలు పడ్డాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news