రెండు ముఖాలు కలిగిన ఆంజనేయస్వామి ఎక్కడున్నాడో తెలుసా ?

-

ఆంజనేయస్వామి.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే హనుమాన్‌ దేవాలయాలు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి అటువంటి ప్రసిద్ధిచెంది… రెండు ముఖాలు కలిగిన హనుమాన్‌ దేవాలయం గురించి తెలుసకుందాం…

కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊరు ఉంది. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు, అందులో కొంతభాగం ఇక్కడ పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా వెలిశారు. మొదట్లో ఆ స్వామి గురించి ఎవరికీ తెలియదు. ఓ అయిదు వందల ఏళ్ల క్రితం సంజీవుడు అనే పశువుల కాపరికి ఆయన కలలో కనిపించి… తన విగ్రహం ఫలానా చోట ఉందనీ, దానికి ఓ గుడి కట్టించమనీ చెప్పారట. అప్పటి నుంచీ ఇక్కడి స్వామి గురించి ప్రపంచానికి తెలుస్తోంది.

కొంగడట్టు ఆంజనేయస్వామి విగ్రహానికి రెండు ముఖాలు ఉండటం ఓ విచిత్రం. అందులో ఒకటి హనుమంతునిది కాగా, మరొకటి నరసింహస్వామిది. అలాగే ఈ స్వామి భుజాల మీద శంఖుచక్రాలు, ఛాతీ మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. స్వామివారి ఆలయంలోనే ఆండాళ్ తల్లి విగ్రహం, శివలింగాలు కూడా ఉండటం విశేషం. స్వామి గుడి వెనకాల బేతాళస్వామి గుడి ఉంటుంది. అక్కడి బేతాళస్వామికి జంతుబలులు, కల్లు నైవేద్యం అర్పించడం మరో ప్రత్యేకత. స్వామి గుడి ముందు సీతమ్మవారి కన్నీట చారలు కనిపిస్తాయి. అరణ్యవాసంలో రాముడి కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు విడిచిందని చెబుతారు.

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటే ఎలాంటి అనారోగ్యమైనా దూరమవుతుందని నమ్ముతారు. గాలిసోకిన వాళ్లని ఈ ఆలయం ముందున్న రావిచెట్టుకి కట్టేస్తే, వాళ్ల ఒంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయని అంటారు. ఇక సంతానం లేనివారు ఈ స్వామిని 40 రోజుల పాటు పూజిస్తే… తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం.

ఇంత మహిమ కలవాడు కాబట్టే… తెలంగాణలో ప్రజలు కొండగట్టు ఆంజనేయస్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తారు. అయ్యప్పమాల లాగా ‘కొండగట్టు అంజన్న’ మాల ధరిస్తారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news