హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన కోటిదీపోత్సవం!!

-

నవంబర్‌ 3- 18 వరకు ఎన్‌టీఆర్‌ స్టేడియంలో కోటిదీపోత్సవం

కార్తీకమాసం అంటే భాగ్యనగరవాసులకు మొదట గుర్తుకొచ్చేది కోటిదీపోత్సవం. ప్రతి ఏటా ఎన్‌టీఆర్‌ స్టేడియంలో భక్తిటీవీ చానెల్‌ వారు కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం నుంచి 18వ తేదీ ప్రారంభమైంది. సహస్రావధాని శ్రీ గరికపాటివారి ప్రవచనా భాష్యంతో ఆధ్యాత్మిక సౌరభం ప్రారంభమైంది. మొదటి రోజు కాశీ నుంచి వచ్చిన విశ్వేశ్వరవిశ్వనాధ స్పటిక లింగానికి సహస్రకలషాభిషేకాన్ని నిర్వహించి ఈ వేడుకలు ప్రారంభించారు.

పీఠాధిపతులు, స్వామీజీల అనుగ్రహ భాషణలు:
ప్రతి రోజూ సాయంత్రం 5.30కు కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ‘పూరీ శంకరాచార్య జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామి, ఉడుపి పెజావర్‌ పీఠాధిపతి విశ్వేశరతీర్థ, బాబా రామ్‌దేవ్‌, గణపతి సచ్చిదానంద, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర’ వంటి ప్రసిద్ధ గురువులు చేతులమీదుగా పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గరికిపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ వంటి ప్రముఖ ప్రవచనకర్తల ప్రవచన భాషణలు ఉంటాయి.

కోటిదీపోత్సవం ప్రత్యేకత..
కార్తికమాసం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహభాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నవంబరు 3 నుంచి 18వ తేదీవరకు జరగనుంది.
భక్తులే స్వయంగా విశేష పూజలు చేసే విధంగా కార్యక్రమాలు జరగుతాయని, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఉంటాయి.

2012లో ప్రారంభమైన దీపోత్సవం
ఈ దీపోత్సవం మొట్టమొదట 2012లో లక్ష దీపాల అంకురార్పణతో ఈ మహాదీపయజ్ఞం ప్రారంభమైంది. 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. భక్తిటీవీ అధినేత నరేంద్ర చౌదరి సంకల్పంతో ఏడు సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఆశేష భక్తజనుల మనసుల్లో చెరగని ముద్రవేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం.. ఎనిమిదోసారి అంగరంగవైభవంగా జరగనుంది.

హిమగిరులు.. లింగోద్భవం
కోటి దీపోత్సవంలో ఏర్పాటుచేసే పలు నమూనాలు అచ్చం కైలాసంలాగా అలరారుతుంటాయి. అంతేకాదు..అక్కడికి వెళ్లి చూడలేమన్న లోటును తీర్చేలా నిర్వాహకులు వైదిక సంప్రదాయంలో వాటిని ఏర్పాటుచేశారు. ఈ వేడుకకు విచ్చేసే ప్రతీఒక్కరినీ కళ్లార్పకుండా చేసేది ప్రధాన వేదిక. ఎత్తైన హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో సదాశివుడు.. శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరసి… అది కైలాస ప్రతిరూపం కాదు.. కైలాసమే అనిపించకమానదు. శంఖారావం మొదలు కార్యక్రమం సమాప్తమయ్యేంత వరకు మహాకైలాస వేదికే కోటిదీపోత్సవ రంగస్థలి. ఈ వేదికపైనే వేదమంత్రఘోష ప్రతిధ్వనిస్తుంది. ఈ వేదికపైనే నియమ నిష్ఠాగరిష్ఠులైన జగద్గురువులు వేంచేస్తారు. ఈ వేదికపైనే సకలదేవతలూ అంటే కాశీ, శ్రీశైలం, ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి, తిరుమల, అన్నవరం, యాదాద్రి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవాలను అంగరంగ వైభవంగా ఆయా క్షేత్రాల్లో నిర్వహించిన విధంగా నిర్వహిస్తారు. అక్కడికి వెళ్లి ఆయా సేవల్లో పాల్గొననివారికి వీటిని వీక్షించి తమ ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవచ్చు. అంతేకాకుండా పౌర్ణమి నాడు జ్వాలాతోరణోత్సవం మరో అద్భుత ఘట్టం. ఈ వేదికపైనే కోటిదీపాల యజ్ఞానికి నాందిగా తొలి దీపం వెలుగుతుంది. ఈ వేదికపైనే దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరిస్తారు. కోటిదీపోత్సవ వేదిక అంటే అది కళ్లముందు కనిపించే కైలాసం.

అజ్ఞానాన్ని దూరం చేసే దీపోత్సవం!
దీపం అంటేనే జ్ఞానానికి ప్రతీక. మనషి అంతరంలోని చీకటిని పోగొట్టే నిజమైన దీపం వెలిగించేది గురువు. అటువంటి గురువుల సమక్షంలో జరిగే దీపారాధన మరింత పుణ్యప్రదమని కార్తీక పురాణ వచనం. అందుకే నియమనిష్ఠా గరిష్టులైన కాషాయాంబరధారుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో పాల్గొనడం కోటి జన్మల పుణ్యఫలం. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్దప్రతిష్టులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు.

భక్తులూ స్వయంగా అర్చనలు చేసుకోవచ్చు!!
ఈ కార్యక్రమంలో కేవలం దీపాలు వెలిగించడమే కాదు. దీనిలో పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు సొంతం చేసుకునే మహాపర్వం. కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. గ్రహదోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీవేంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఆయా రోజులకు సంబంధించిన పలు ప్రత్యేక కార్యక్రమాలను రేబెల్లి రాజుశర్మ, తదితర వేదపండితుల సమక్షంలో, ఆయా పుణ్యక్షేత్రాల నుంచి వచ్చే ప్రధాన అర్చకుల చేతులమీదుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

విద్యుత్‌ వెలుగుల నుంచి దీపాల వెలుగు అద్భుతం!
కోటిదీపోత్సవంలో అన్నింటికీ మించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథమహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్‌ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటిదీప కాంతుల నడుమ జరిగే లింగోద్భవం ఓ అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణంలో ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే సంచరిస్తున్నాడనే భావన కలుగుతుంది.
ఆయా క్షేత్రాలను, అక్కడి దివ్యవిశేషాలను చూడలేనివారు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలలోపు లోయర్‌ట్యాంకు బండ్‌ దగ్గరలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంకి వెళితే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news