పాండవులను అగ్ని ప్రమాదం నుంచి ఎవరు కాపాడారు?

-

కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడు వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు. దీంతో ధుర్యోధనుడికి, ధ్రుతరాష్ర్టుడికి అసూయ పెరుగుతుంది.దీంతో వారిరువురు కలిసి పాండవుల అంతానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. వారణావతం వెళ్లటానికి ధ్రుతరాష్ర్టుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. పాండవులను కొన్ని రోజులపాటు వారణావతంలో నూతనంగా నిర్మించిన లక్క ఇంట్లో ఉండమని పంపిస్తాడు. అక్కడ పాండవులను అంతమొందించాలని ధుర్యోధనుడు పురోచనుడనే మంత్రితో పన్నాగం పన్నుతాడు. వారణావతంలో సకల సౌకర్యాలు ఉన్న రాజభవనాన్ని నిర్మిస్తారు.

ఆ భవనం నేతిలో కలిపిన లక్క, గుగ్గిలం, మైనం మున్నగు వాటితో నిర్మిస్తారు. నిప్పురవ్వ తగిలినా బూడిదై పోయ్యేలా నిర్మిస్తారు. హస్తినాపురం నుంచి పాండవులు లక్కా ఇల్లు దగ్గరికి చేరుకుంటారు. వారికి కుట్ర గురించి తెలియదు. కానీ వారు బయలు దేరే సమయంలో విదురుడు కొద్ది దూరం సాగనంపడానికి వచ్చి ద్వందార్థంలో మాటను ధర్మరాజుకు చెప్తాడు. కొంతదూరం ప్రయాణం తర్వాత కుంతీదేవి నాయనా! ధర్మరాజా విదురుని మాటల్లో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది అంటుంది. ఏమా రహస్యం అని అడుగుతుంది. అమ్మా మనం నివసించబోయే భవనం కాలిపోతుందనీ, ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి సొరంగం త్రవ్వుకోవాలని అర్థం అని చెప్తాడు.

పాండవులు వారణావతం చేరుకున్నారు. వారికోసం నిర్మించిన శివభవనంలో పాండవులు ప్రవేశించారు. భవనమంతా కలియజూసిన ధర్మరాజు భీమునితో ఈ భవనమంతా నేయి వాసనలు వెదజల్లుతున్నది. ఇదొక మాయా ఇల్లులాగా ఉంది. కొన్నిరోజుల తర్వాత సొరంగాలు తవ్వడంలో నిపుణుడైన ఖనకుడనే వాన్ని విదురుడు పాండవుల వద్దకు పంపిస్తాడు. ఖనకుడి సాహయంతో పాండవులు సొరంగం తవ్వుకుని అవతలి వైపు గంగానది తీరానికి చేరుకుంటారు. సొరంగంలోకి పోయే ముందు లక్కా ఇంటికి భీముడు నిప్పు పెడుతాడు. దాంతో అది అంతా బూడిదై పోతుంది. కౌరవులకు లక్క ఇల్లు తగలబడిందని తెలిసి సంబురాలు చేసుకుంటారు. కానీ వారంతా సొరంగం గుండా అడవిలో దూరంగా వెళ్లిపోయారన్న విషయం కేవలం విదురుడికి మాత్రమే తెలుసు. పాండవులు బూడిదైపోయారన్న వార్తతో భీష్మద్రోణులు చాలా బాధపడ్డారు. ఈ సమయంలో విదురుడు భీష్ముడికి పాండవులు మరణించలేదని అసలు కథ చెప్తాడు. ఇప్పుడు తెలిసింది కదా.. లక్క ఇల్లు తగలబడ్డా పాండవులు క్షేమంగా ఉండటానికి ప్రణాళిక వేసింది కౌరవుల మరో మంత్రి విదురుడు అని. అంటే పాండవుల ప్రాణదాత విదురుడు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news