నేటి నుంచే కరోనా టీకా రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ

-

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా టీకా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. 18 నుంచి 44 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్‌ పొందాలనుకుంటే కొవిన్ ( CoWIN) వెబ్‌పోర్ట‌ల్‌ లేదా ఆరోగ్యసేతులో త‌ప్ప‌నిసరిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకునే వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ టీకాకు సంబంధించి రిజిస్ట్రేష‌న్ ప్రక్రియ నేటి (బుధవారం)నుంచి ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని కేంద్రం తెలిపింది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా కొవిన్ పోర్ట‌ల్ (cowin.gov.in)ను ఓపెన్ చేయాలి. అనంత‌రం మొబైల్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి ఓటీపీ పొందాలి. ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్‌ వ్యాక్సినేష‌న్ అని పేజి ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేష‌న్ లో భాగంగా ఫొటో ఐడెంటిటీ కార్డును ఎంచుకొని, ఐడెంటిటీ కార్డు నంబ‌ర్‌తో పాటు పేరు, పుట్టిన సంవ‌త్స‌రం వంటి వివ‌రాల‌ను న‌మోదు చేసి రిజిస్ట‌ర్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేష‌న్ అనంత‌రం ఏ రోజు టీకా వేయించుకోవాలో మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం రిజిస్ట్రేష‌న్ అనంత‌రం కనిపించిన షెడ్యూల్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంట‌ర్ చేయ‌గానే.. ఆ ప్రాంతంలో గల టీకా కేంద్రాల జాబితా క‌నిపిస్తుంది. అందులో మనకు అందుబాటులో ఉన్న టీకా కేంద్రంతో పాటు డేట్ మరియు టైంని ఎంచుకొని క‌న్ఫార్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అయితే ఒకే లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంది. అలాగే షెడ్యూల్ తేదీల‌ను కూడా మార్చుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news