కంట్రీ ఫస్ట్… ఎవ్రిథింగ్ నెక్స్ట్!

-

భారతదేశంలో కరోణా వ్యాప్తి అనేది ఒక మతానికో ఒక కులానికో ఆపాదించడం అనే విమర్శలు అర్ధరహితం అయినప్పటికీ… ఇది అంతా ఐకమత్యంగా ఎవరికి వారు తమ బాధ్యతలు గుర్తెరిగి నడుచుకోవాల్సిన సమయం! ఐకమత్యమే (భౌతికదూరం పాటిస్తూ) మహా బలం అనేది అంతా గుర్తించాల్సిన విషయం! ఈ విషయంలోనే శ్రీరామనవమి, ఉగాది… గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి పండుగలు ఎలాగైతే ఎవరికి వారు ఇళ్లల్లో జరుపుకున్నారో అలాగే రంజాన్ మాసంలో ముస్లింలు కూడా ఎవరికి వారే కుటుంబ సభ్యులతో ఇళ్లల్లోనే ఇఫ్తార్ విందులు చేసుకోవాలని సూచిస్తుంది కేంద్రం!

ముస్లింలకు అత్యంత కీలకమైన రంజాన్ మాసం మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న తరుణంలో.. కేంద్రం ఆదేశాలు జారీచేసింది! కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్న ఈ తరుణంలో మార్చి 24 తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని కేంద్రం తెలిపింది. ఇది కేవలం ముస్లింలకు మాత్రమే అనుకుంటే పొరపాటని… హిందూ దేవాలయాలు, క్రిస్టియన్ చర్చిలతోపాటు ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు ఈ రూల్ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఈ విషయాలపై ఇప్పటికే కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి దేశంలోని అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే.. రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని, మసీదులని మూసివేచి ఉంచాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని కేంద్రం తెలిపింది. దీంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాలలో రాష్ట్రంలోని అన్ని మసీదులు మత పెద్దలకి సర్కులర్ జారీచేసినట్టు తెలంగాణ  వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ కూడా ప్రకటించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మసీదుకు సర్కులర్ పంపామని లాక్ డౌన్ సమయం ముగిసే వరకు అందరూ కూడా తమ తమ ఇళ్లల్లోనే ప్రార్ధనలు చేసుకోవాలని తెలిపారు.

నిజమే కదా… కేంద్రం ఆదేశించిందనో, రాష్ట్రం నోటీసులు పంపిందనో కాదు కానీ… ఈ సమయంలో హిందూ, ముస్లిం, క్రీస్టియన్ అనే తారతమ్యాలు లేకుండా అంతా కలిసి… ప్రార్థనలు, పూజలు ఇళ్లల్లో చేసుకుంటూ ఉంటే చాలు దేశసేవ చేసినట్లే! అలాకాని పక్షంలో మనం ఇన్ని రోజులు ఇంట్లో ఉండి చేసిన దీక్ష వృధా అవుతుంది!!

Read more RELATED
Recommended to you

Latest news