వచ్చే సోమవారం మళ్ళీ జిఎస్టి కౌన్సిల్ సమావేశం.. ఈలోపు పరిహారం !

-

వచ్చే సోమవారం మరోసారి జి.ఎస్.టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. జి.ఎస్.టి పరిహారం కింద వసూలైన రూ 20,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు బదలాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. వచ్చే వారంలోగా మరో రూ. 24,000 కోట్లను ఐజీఎస్టీ కింద చెల్లిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి ప్రకటించారు. జి.ఎస్.టి సెస్‌ను ఐదేళ్ల పాటు విధించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరగా మరికొంత కాలం పరిహార సెస్‌ వసూలును పొడిగిస్తామని ప్రకటించారు. జి.ఎస్.టి, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్స్‌పై నిన్నటి సమావేశంలో పెద్ద చర్చే జరిగింది.

పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని…పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేశారు. ఐజీఎస్టీ కింద‌ రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలనే డిమాండ్‌ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ముందు పలు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు ఉంచారు. జి.ఎస్.టి పరిహారం చెల్లింపుపై ఎటూ తేల్చకపోవడంతో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని జి.ఎస్.టి కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వెంటాడటంతో రుణ అవకాశాలను తోసిపుచ్చుతూ జి.ఎస్.టి పరిహారంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. రుణ అవకాశాలను తోసిపుచ్చిన రాష్ట్రాలు, కేంద్రం చెల్లించాల్సిన 97,000 కోట్ల రూపాయల జి.ఎస్.టి పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news