ఏపీలో మహిళా ఓటర్లే అధికం : సీఈవో ముకేష్ కుమార్ మీనా

-

ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. నవంబరు 9 నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 68,115 సర్వీసు ఓటర్లు, 3,858 ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉన్నట్లు వెల్లడించారు.

నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లను  ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో జాబితా నుంచి తొలగించినట్టు సీఈవో తెలిపారు.  10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి డిలీట్‌ చేశామని వెల్లడించారు. గతేడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి 8,82,366 మంది ఓటర్లు తగ్గారని చెప్పారు. ఏపీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని ముకేశ్ పేర్కొన్నారు.

ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదని సీఈఓ స్పష్టం చేశారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తయిందని తెలిపారు. నిరాశ్రయులకు ఓటరు కార్డు ఇవ్వాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఎలాంటి గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news