జనసేన లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే ?

-

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముంగిట అధికార పార్టీ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా ప్రకటించి వేరే పార్టీల్లో చేరారు. మరికొంతమంది చేరికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే.

 నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌ పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది.  తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తో భేటీ అయ్యారు. వెలగపల్లి వరప్రసాద్‌ కు వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించిన తాజా జాబితాల్లో సీటు దక్కలేదు. గూడూరు సీటును ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీధర్‌ కు జగన్‌ కేటాయించారు.  మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన వెలగపల్లి వరప్రసాద్‌.. 2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తిరుపతి నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు.

2014లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019లో ఆయనకు వైఎస్‌ జగన్‌ గూడూరు అసెంబ్లీ సీటును కేటాయించారు. గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.ఈసారి వరప్రసాద్‌ కు జగన్‌ ఎక్కడా సీటు కేటాయించలేదు. దీంతో వరప్రసాద్‌ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్‌ ను కలిశారు. జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news