దేశంలోనే తొలిసారిగా ఏపీ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు!

-

ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చింది. బస్సుల్లో ఇకపై నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ- పాస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్(టిమ్) స్థానంలో వీటిని తీసుకురావాలని నిర్ణయించిన ఆర్టీసీ.. ఇందుకోసం విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో గత మూడు రోజులుగా వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల స్పందనను బట్టి దశలవారీగా మిగతా బస్సులోనూ వీటిని అమలు చేయాలని యోచిస్తున్నారు. మిషన్ల ఉపయోగంపై కండక్టర్లు, డ్రైవర్లు లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్సిగో- అభిబస్ సంస్థ ఈ యంత్రాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం 50 ఈ-పాస్ మిషన్లను అందించింది. త్వరలోనే మరిన్ని అందించనుంది. ఈ మిషన్ల ద్వారా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు అంటే.. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టికెట్ ధర చెల్లించుకోవచ్చు. నగదు చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ మిషన్ల ద్వారా చిల్లర సమస్యకు పులిస్టాప్ పడుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news