నాని వాళ్లను తిడితే జగన్ కు నొప్పి లేదా ? 

-

ఇప్పటివరకు ఏపీ మంత్రి కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్, దేవినేని ఉమ వంటి వారిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు తీవ్ర స్థాయిలో చేసేవాడు. నాని తిట్టే తిట్లు విమర్శలు పాలైన, జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేసేవారు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ,  నాని తిట్లను జనాలు ఎంజాయ్ చేస్తూ, పదే పదే వింటూ ఉండేవారు. ఆ స్థాయిలో నాని టిడిపి నేతలపై విమర్శలు చేసేవారు. పప్పు నాయుడు, పప్పు గాడు , సన్నాసి…. ఇంకా చాలా చాలా చాలా తిట్లనే నాని తిడుతూ ఉండేవారు. ఇక అసెంబ్లీలోనూ, చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని చేసే విమర్శలు హైలెట్ అవుతూ ఉండేవి. నాని తిట్లకు బాబు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉండేది.
ఇలా కొడాలి నాని తిట్ల దండకం అందరితో పాటు, ఏపీ సీఎం జగన్ సైతం ఎంజాయ్ చేస్తూ వచ్చేవారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నాయకులను తిట్టు పోసేందుకు నాని ముందుకు వచ్చేవారు. మా కమ్మోళ్లు అంటూనే, ఆ సామాజిక వర్గం నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. జగన్ సైతం నానికి ఆ స్థాయిలోనే ప్రాధాన్యం ఇస్తూ,  మరింతగా ప్రోత్సహించినట్లు గా వ్యవహరించేవారు ఇదంతా వైసీపీకి మరింతగా ఇమేజ్ తీసుకు వస్తూ ఉండేది. ఇంత వరకు బాగానే ఉన్నా, అంతర్వేది వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం, ముఖ్యంగా హిందుత్వ విషయంలో బిజెపి బాగా టార్గెట్ చేయడం వంటి పరిణామాలతో జగన్ ప్రభుత్వం బాగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఈ సమయంలో నాని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టిడిపిని విమర్శించే క్రమంలో దేవుళ్ళ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల కోసం డిక్లరేషన్ తీసుకోవడం ఎప్పటి నుంచో టీటీడీలో  నిబంధన గా ఉంటూ వస్తోంది. అయితే అకస్మాత్తుగా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆ డిక్లరేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా విపక్షాలు  భగ్గుమన్నాయి. ఈ వ్యవహారంలో తలదూర్చిన నాని రాష్ట్రంలో ఏ ఆలయంలో లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాజకీయ నాయకుడిగా తాను మసీదుకు వెళ్ళినా ఎవరూ తనను డిక్లరేషన్ అడగలేదని, రాష్ట్రంలో ఏ గుడికి లేని నిబంధనలు తిరుపతిలో ఎందుకంటూ నాని వ్యాఖ్యానించారు.
ఆలయాల్లో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలపై స్పందిస్తూ ఆంజనేయ స్వామి బొమ్మ చేయి విరిగితే ఆంజనేయుడికి వచ్చే నష్టం ఏమీ లేదు. పది కేజీల వెండి పోతే దుర్గమ్మ కి వచ్చే నష్టం ఏమీ లేదు. కోటి రూపాయల రథం తగలబెడితే అంతర్వేది స్వామికి వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ ప్రతిపక్షాలే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర విమర్శల పాలయ్యాయి. నాని ఇప్పటివరకు ఎలా మాట్లాడినా.. ఇప్పుడు మాత్రం హిందుత్వం విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మరోసారి  ఈ రకంగా మాట్లాడడం జగన్ కు తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తుంది. నాని వ్యాఖ్యలపై ఇప్పటివరకు కు జగన్ పెద్ద స్పందించినట్లు గా కనిపించలేదు. కనీసం నానితో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి, నష్ట నివారణ చర్యలు తీసుకుంటే పార్టీకి, జగన్ భవిష్యత్తు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జగన్ కానీ, నాని కానీ ఆ విధంగా అడుగు వేస్తారా అనేది పెద్ద అనుమానమే.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news