భక్తులకు కర్రలు ఇవ్వడంపై రఘురామ సెటైర్లు

-

తిరుమలలో కాలినడకన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు జగనన్న స్టిక్కర్లతో కూడిన కర్రలు ఇవ్వడం కాదని, ఒక కిలోమీటర్ మేర వాక్ వే నిర్మించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. భక్తులకు తమ పార్టీ అధికార ఆయుధం గొడ్డలి, కోడి కత్తి ఇస్తారేమోనని అనుమానం వచ్చిందని, ఇప్పుడు కర్రలు ఇచ్చి తరువాత గొడ్డలి ఇస్తారేమోనని అన్నారు. తనని తాను సింహంగా చెప్పుకొనే జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్న మాస్కులను కాలినడకన వెళ్లే భక్తులకు ఇవ్వాలని, ఆ మాస్క్ ధరించి భక్తులు వెళితే వన్య మృగాల నుంచి ప్రమాదం ఉండకపోవచ్చునని ఎద్దేవా చేశారు.

అలిపిరి నుంచి గాలిగోపురం వరకు కాలినడకన వెళ్లే భక్తులకు ఎటువంటి ప్రమాదం లేదని, గాలిగోపురం నుంచి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుందని, శేషాచలం అడవుల్లో ఇటీవల పుష్పలు ఎక్కువయ్యారని, వాళ్ళు అక్కడ చేస్తున్న విధ్వంసానికి వన్య మృగాలు తమ ప్రాణ రక్షణ కోసం గతిని మార్చుకున్నాయని అన్నారు. వన్యమృగాలతో పాటు చిరుతలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని, క్రూర మృగాల నుంచి భక్తులకు రక్షణ కల్పించడానికి వాక్ వే నిర్మిస్తామంటే దాతలు ముందుకు వచ్చి విరాళాలను అందజేస్తారని అన్నారు.

భగవంతుడి దగ్గర చేసే కార్యక్రమాలకు భక్తులు ఎల్లవేళలా సాకారం అందిస్తూనే ఉన్నారని, భగవంతుడికి భక్తులను దగ్గర చేసే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రస్తుతం టీటీడీ చేస్తున్న కార్యక్రమాల ద్వారా భక్తుడు, భగవంతునికి దూరమయ్యే ప్రమాదం ఉందని, టీటీడీ పాలకమండలి నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, సీబీఐ చీఫ్ కు, కేంద్ర మంత్రులకు తమ పార్టీ నాయకులు పదవులను ఆఫర్ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తా కథనం వెలువడిందని, ఇప్పటికే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, దేవుడి విషయంలోనైనా అలా చేయకండని అన్నారు. క్రైస్తవుడైన జగన్ మోహన్ రెడ్డి గారు తమ మతాన్ని గౌరవించాలని, ఎవరైతే పూర్తిగా ఈ మతాన్ని ప్రేమిస్తారో, పైరవీలు చేయకుండా నిస్వార్ధంగా దేవుని సేవకు అంకితం అవుతారో అటువంటి వారికే టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version