అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలను రచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్ సీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 25న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర 6 జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో సభ నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో తాజాగా సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు అభిమానులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతీ నియోజకవర్గం నుంచి ఐదారు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశముందని తెలిపారు. ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ధ ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ఉద్దేశం చేస్తారని తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు బొత్స సత్యనారాయణ.