రేపు శ్రీకాకుళం జిల్లాలోని 8 మండలాలు అలాగే విజయనగరం జిల్లాలోని 15.. పార్వతీపురం మన్యం జిల్లా 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 167 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా-16, విజయనగరం-10, పార్వతీపురం మన్యం-3, అల్లూరి సీతారామరాజు-9, విశాఖపట్నం-2, అనకాపల్లి-16, కాకినాడ-15, కోనసీమ-9, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-3, ఏలూరు-13, కృష్ణా-10, ఎన్టీఆర్-8, గుంటూరు-14, బాపట్ల-1, పల్నాడు -19 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
మంగళవారం 25 మండలాల్లో తీవ్రవడగాల్పులు,89 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.