శివ‌సేన‌కు భారీ షాక్‌… 17 మంది ఎమ్మెల్యేలు జంపేనా…!

-

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న శివసేనకు భారీ షాక్ త‌గిలే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో ముందుగా బీజేపీతో డ్రామాలు ఆడిన శివ‌సేన ఆ త‌ర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి అయినా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు బేర‌సారాలు ఆడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇంకా ప్ర‌భుత్వ ఏర్పాటు లేక‌పోవ‌డంతో ఓ వైపు రాష్ట్రంలో ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ పాల‌న అమ‌ల్లోకి వ‌చ్చింది.

ఇక ఓ వైపు శివ‌సేన డ్రామాలు ఆడుతుండ‌గానే బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి షాక్‌ ఇచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు గళమెత్తారు. వీరంతా పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ కానున్నారు. మరోవైపు శివసేన సారథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. రౌత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి శివ‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే వ‌స్తున్నారే త‌ప్పా అది జ‌ర‌గ‌ని పరిస్థితి.

ఇక బుధ‌వార‌మే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమావేశం సైతం మ‌హా రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపింది. ఎన్సీపీ – బీజేపీతో చేతులు క‌లుపుతోంద‌న్న వార్త‌లు కూడా శివ‌సేన‌ను టెన్ష‌న్ పెట్టాయి. అయితే శ‌ర‌ద్ ప‌వార్ మాత్రం రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి త‌మ భేటీలో రాలేద‌ని.. కేవ‌లం రైతుల సమస్యలపైనే తాను ప్రధానిని కలిశానని పవార్‌ వెల్లడించారు.

ఇక ప్ర‌భుత్వ ఏర్పాటు అంశంపై శివ‌సేన – కాంగ్రెస్ – ఎన్సీపీ మ‌ధ్య చ‌ర్చ‌లు కొలిక్కి రాని ప‌క్షంలో బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెడీగా ఉన్న‌ట్టు ఉంది. శివ‌సేన‌లో అస‌మ్మ‌తి ఎమ్మెల్యేలు అవ‌సరాన్ని బ‌ట్టి బీజేపీలోకి జంప్ చేసేందుకు కూడా వెనుకాడ‌డం లేద‌ట‌. శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ముందున్న అవకాశాలపై ఆరా తీస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news