చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

-

టీడీపీ అధినేత చంద్రబాబకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టైన చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా తన వాదనలు వినిపించాడు. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని లూథ్రా వాదించారు.

ఇవాళ ( బుధవారం ) సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసుకోవచ్చని శ్రీరామ్ అన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఆయన అన్నారు. కాగా.. అమరావతి రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్, దానిని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతేడాది ఏప్రిల్ 27 సీఐడీ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీనిపై అదే ఏడాది మే 9న పలువురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా సీఐడీ పేర్కొంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ ఏ14గా ఉన్నాడు. మాజీ మంత్రి నారాయణ తదితరులను కూడా సీఐడీ నిందితులుగా పేర్కొంది. ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ జారీ చేయాలంటూ నారా లోకేష్ కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version