వన్ ఇయర్ స్పెషల్: బాబుకి ఇంకా అర్ధంకాని జగన్ అప్ డేటెడ్ పాలిటిక్స్!

-

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు… ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం ఆలోచనలే చేస్తున్నారా? జనం అప్ డేట్ అయ్యారు.. వారికి అనుగుణంగా జగన్ అప్ డేట్ అయ్యారు… అప్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు! ఆ అప్ డేటెడ్ పాలిటిక్స్ కి ఏడాది పూర్తయ్యింది. అయినా కూడా కనీసం అవి చూసైనా బాబు అప్ డేట్ అవ్వడం లేదు. అప్ డేట్ అవ్వడం అంటే ఆన్ లైన్ లో మహానాడు చేయడం కాదని బాబు ఇంకా గ్రహించడం లేదు. అవును… చంద్రబాబు ఇంకా 40 ఏళ్ల క్రితం రాజకీయాలు చేస్తున్నారని.. తన వయసు 70 దాటాయన్న విషయం జనాలకు పదే పదే గుర్తు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి! వాటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం!

మహనాడు వేదికగా బాబు & కో చెప్పిన మాట… నవ్యాంధ్రలో తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఎంత చేసినా 2019లో ఎన్నికల్లో వారు టీడీపీని నమ్మలేదని! ఇదే క్రమంలో ఇకపై పార్టీ భారం అంతా బీసీలదే అని! గత ఎన్నికల్లో పార్టీకి దూరమయిన బీసీ వర్గాలను దగ్గర చేసుకునే విధంగా కృషి చేస్తామని! అంటే… నిన్నటి నేరం రేపటి భారం అంతా బీసీలదే అనేది మహానాడు వేదికగా బాబు చేసిన కుల రాజకీయ ప్రకటన!! ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి రాజకీయాలు అని అంటున్నారు విశ్లేషకులు!

చంద్రబాబుకు గతంలో ఒక్క బీసీలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి రాలేదు.. 2019 ఎన్నికల్లో ఒక్క బీసీలు దూరమయితేనే అధికారం పోలేదు! అన్ని వర్గాలూ కలిసి చీత్కరించుకుంటేనే ఆ పరిస్థితి తలెత్తింది! ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క కులమో, మతమో మాత్రమే ఓట్లు వేస్తే అధికారంలోకి రారు.. అధికారాన్ని కోల్పోరు! పోని సరే బీసీలు అసంతృప్తి వల్లే టీడీపీ ఓడిపోయింది అని కాసేపు అనుకుంటే… బీసీలు ఎందుకు అసంతృపి చెందారయ్యా అంటే… కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ప్రకటించడం వల్లంట! ఇంతకు మించి బీసీలను అవమాన పరిచే మాట మరొకటి ఉంటుందా? బీసీలను, కాపులను విభజించి పాలించాలనే బుద్దికి ఈ మాటలు నిదర్శనం కాదా?

అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు నమ్మితేనే, అభిమానిస్తేనే అధికారం వస్తుంది… అది రివర్స్ అయిన రోజు అధికారం పోతుంది! ఈ విషయాలు మరిచిన బాబు ఇంకా ప్రజలకు కులాలుగా విభజించి చూస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాను అధికారం చేపట్టినప్పటినుంచీ జగన్.. జనాలను కులాలుగా, మతాలుగా విభజించే పనికి ఏమాత్రం పూనుకోలేదు!

రైతులకు రైతుభరోసా, ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర, దర్జీలకు జగనన్న చేదోడు, పిల్లలకు అమ్మవడి, బడి పిల్లలకు జగనన్న గోరుముద్ద… ఇలా ప్రజలను కులాలుగా మతాలుగా కాకుండా వారి వారి ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లుగా, వారి వారి వృత్తులకు, ఉద్యోగాలకు, వారి వారి అవసరాలకు తగ్గట్లుగా చూస్తూ.. అందరికీ న్యాయం చేకూరే విధంగా, అందరూ తనని సొంతం చేసుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నారు! ఇది అప్ డేటెడ్ పాలిటిక్స్!

ఎస్సీ, ఎస్టీలకే వాహన మిత్ర, బీసీలకే రైతు మిత్ర, ఓసీలకే రుణ మిత్ర, మైనార్టీలకే చేదోడు, అర్చకులకే ఐదు వేలు వంటి మాటలు జగన్ ఎక్కడా మాట్లాడటం లేదు. మరీ అవసరం వస్తే తప్ప.. కుల మత ప్రస్థావనలు వీలైనంత వరకూ చేయకుండా.. జనం అంతా ఒక్కటే, ఎవరికైనా సమస్య ఒక్కటే అన్న విధంగా పరిపాలన సాగిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ గా వన్ ఇయర్ పూర్తి చేసుకున్నాడు.

ఇలా అప్ డేటెడ్ పాలిటిక్స్ చేయాల్సిన రోజుల్లో కూడా బాబు ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, కమ్మలు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు, మైనారిటీలు అంటూ వేరు చేసి మాట్లాడటం… ప్రజలను ఇంకా వెనక్కి తీసుకెళ్లడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు!! ప్రజలను వెనక్కి తీసుకెళ్లడం సంగతి అటుంచితే… బాబు ముందుకు వెళ్లలేకపోతున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news