భారత్‌లో కరోనా టెస్ట్‌ ఇక ఆన్‌లైన్‌లో..!

-

తమకు కరోనా సోకిందేమోనని భయపడే భారతీయులకు శుభవార్త. ఆన్‌లైన్‌లో కొవిడ్‌-19 టెస్ట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం ఇండియాలో అందుబాటులోకి వచ్చింది.ప్రముఖ ఆన్‌లైన్‌ వైద్య సదుపాయాల సంస్థ ‘‘ప్రాక్టో’’ , కొవిడ్‌-19 పరీక్షలను చేపట్టింది. ఇంటి నుంచే సాంపిల్స్‌ సేకరించి, పరీక్షించి, ఫలితాలను వెల్లడించనుంది.

 

బెంగళూరుకు చెందిన ప్రాక్టో, ప్రముఖ డయాగ్నొస్టిక్స్‌ సంస్థ ‘థైరోకేర్‌’ తో జతకట్టి ఈ టెస్ట్‌లకు నడుం బిగించింది. థైరోకేర్‌సంస్థకు భారత ప్రభుత్వం, భారత వైద్య పరిశోదనా సంస్థ (ఐసీఎంఆర్‌) కరోనా టెస్టులు నిర్వహించేందుకు అనుమతించాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ప్రాక్టో, ప్రస్తుతం ముంబయి, పుణె వాసులకు ఈ టెస్టులు అందుబాటులో ఉండగా, మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపింది.

టెస్టింగ్‌ కోసం డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌, డాక్టర్‌ సంతకం చేసిన పరీక్ష అనుమతి పత్రం, ఫోటో గుర్తింపు కార్డు కాపీలను ఇవ్వవలసిఉంటుంది. ఈ పరీక్షకు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం రూ. 4500 లకే చేయనన్నట్లు చెప్పిన ప్రాక్టో, ఆన్‌లైన్‌లో ఈ క్రింది అడ్రస్‌లలో బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

https://www.practo.com/covid-test

https://covid.thyrocare.com/

 

ఐ2హెచ్‌ హెల్త్‌కేర్‌ నుండి అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు ఇంటికే వచ్చి, సాంపిల్స్‌ సేకరిస్తారని తెలిపిన ప్రాక్టో, ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే ఈ సేకరణ జరుగుతుందని, దాన్ని భద్రంగా ‘వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం’ ద్వారా శీతల పద్ధతిలో థైరోకేర్‌ ల్యాబోరేటరీకి తరలిస్తామని స్పష్టం చేసింది. 24 నుండి 48 గంటల లోగా ఫలితాలను ప్రాక్టో వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడిస్తామని ప్రాక్టో ముఖ్య అధికారి డాక్టర్‌ అలెగ్జాండర్‌ కురువిల్లా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news