పబ్ డ్యాన్సర్‌ను సజీవ దహనం చేసిన భర్త

-

అనుమానం పెనుభూతమైంది. అదే కట్టుకున్న భార్యను కడతేర్చేలా చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఓవైసీ కాలనీలో చోటు చేసుకున్నది. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల సానియా బేగం, నగరంలోని సంతోష్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల షేక్ సల్మాన్ మధ్య ప్రేమ చిగురించింది. సానియా పబ్ డ్యాన్సర్. పాటలు కూడా పాడుతుంది. ఆసమయంలోనే సల్మాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దలను ఒప్పించి ఇద్దరు ఓ ఇంటివారయ్యారు. కొడుకు పుట్టాడు. మూడేళ్ల పాటు వాళ్ల కాపురం సజావుగా సాగింది.

కట్ చేస్తే.. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. సానియాకు, సల్మాన్‌కు ఒక్క క్షణం కూడా పడేది కాదు. కొడుకును కూడా సరిగా చూసుకోవట్లేదని.. తనను పట్టించుకోవట్లేదని సల్మాన్ రోజూ సానియాతో గొడవ పెట్టుకునేవాడు. అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చేది. దీంతో సల్మాన్‌కు సానియాపై అనుమానం కలిగింది. ఆ అనుమానం అలాగే రోజురోజూ బలపడుతూ పోయింది. దీంతో వాళ్లు మకాం కూడా మార్చారు. ఓవైసీ కాలనీకి మారారు. అయినప్పటికీ.. సానియాలో ఎటువంటి మార్పు రావట్లేదని గమనించిన సల్మాన్ తనను అంతమొందించాలనుకున్నాడు. దీంతో గత మంగళవారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన సల్మాన్ తన భార్యతోనూ మద్యం తాగించాడు. భార్య మద్యం మత్తులో ఉండగా భార్య కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం తన మీద కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తర్వాత ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం వాళ్ల ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సల్మాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదివరకు కూడా సల్మాన్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news