షేవింగ్ చేస్తుండగా గొడవ.. కస్టమర్ గొంతు కోసిన సెలూన్ ఓనర్

-

షేవింగ్ విషయంలో జరిగిన ఓ గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. మూక దాడులు, భారీ ఆస్తి ధ్వంసానికి గురైంది. ఈ ఘటన మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కిన్వట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు సోలంకి తెలిపారు.

బోధి గ్రామంలో అనిల్ మారుతి శిందే నిర్వహిస్తున్న సెలూన్ షాప్‌కు వెంకట్ సురేశ్ దేవ్(22) అనే యువకుడు షేవింగ్ చేయించుకునేందుకు గురువారం రాత్రి వెళ్లాడు. సగం గడ్డం తీశాక వెంకట్‌ను డబ్బులు ఇవ్వమని అడిగాడు అనిల్. షేవింగ్ మొత్తం చేశాక ఇస్తానని వెంకట్ చెప్పినా.. అనిల్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. కోపోద్రిక్తుడైన అనిల్ పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు కోయగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న అతడి బంధువులు తీవ్ర ఆగ్రహంతో సెలూన్​ షాప్​పై విరుచుకుపడ్డారు. దుకాణాన్ని తగలబెట్టారు. యజమాని అనిల్​ను వెతికి పట్టుకుని.. గ్రామంలోని ఓ మార్కెట్​లో కొట్టి చంపారు. అనంతరం అతడి ఇంటిని తగలబెట్టారు. సమాచారం అందిన వెంటనే కిన్వట్​ పోలీసులు హుటాహుటిన బోధి గ్రామానికి చేరుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version